Home Latest News *చత్తీస్ గడ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు 70 మృతి చెందారు..*

*చత్తీస్ గడ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు 70 మృతి చెందారు..*

by Jananethram News
0 comments

*జననేత్రం న్యూస్ స్టేట్ బ్యూరో మే21*//:ఈ విషయాన్ని *కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎక్స్‌లో వెల్లడించారు.* బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో *27 మంది మావోయిస్టులు మృతి చెందారు.* వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. *కేశవరావుపై రూ.1.5కోట్లు రివార్డు* ఉందని తెలిపారు.
*నక్సలిజం నిర్మూలనలో ఇదో మైలురాయి: అమిత్ షా*
‘నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలు రాయి విజయం… ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో 27మంది మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో *మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, నక్సల్‌ ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు ఉన్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న మూడు దశాబ్దాల పోరులో ప్రధాన కార్యదర్శి స్థాయి కలిగిన నేత మృతి చెందడం ఇదే తొలిసారి.* భద్రతా దళాలకు అభినందనలు. ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్టు పూర్తయిన తర్వాత ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మహారాష్ట్రలలో 54మంది నక్సలైట్లు అరెస్టు అయ్యారు. 84మంది లొంగిపోయారు. 2026 మార్చి 31 నాటికి *నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ సర్కార్‌ దృఢ సంకల్పంతో ఉంది” అని అమిత్‌ షా ఎక్స్‌లో* పేర్కొన్నారు.
*గణపతి తర్వాత పార్టీ పగ్గాలు*
ఎన్‌కౌంటర్‌లో మరణించిన నంబాల కేశవరావును బసవరాజు, క్రిష్ణ, వినయ్‌, గంగన్న, బసవర రాజు, ప్రకాష్‌, బీఆర్‌, ఉమేష్‌, రాజు, విజయ్‌, కేశవ్‌, దారపు నరసింహారెడ్డి, నరసింహ అని మారు పేర్లతో కూడా పిలిచేవారు. *2018 నవంబర్‌లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత* అతను *పార్టీకి సుప్రీం కమాండర్* అయ్యారు.
*శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామంలో 1955లో కేశవరావు జన్మించారు.* తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. కేశవరావుకు సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.
*ఎంటెక్‌ టు నక్సలిజం..!!*
కేశవరావు ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. తాతగారి ఊరు అయిన టెక్కలి మండలం తలగాంలో హైస్కూల్ విద్య, టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన ఆయన.. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగా *వరంగల్‌లో బీటెక్‌ సీటు రావడంతో అక్కడికి వెళ్లి జాయిన్* అయ్యారు. *వరంగల్‌లోని రీజినల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల (ఆర్‌ఈసీ) బీటెక్ చదువుతుండగానే రాడికల్ విద్యార్ధి సంఘం వైపు అడుగులు వేశారు.* *1984లో ఎంటెక్‌ చదువుతున్నప్పుడు సీపీఐ(ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ గ్రూపు సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు.* ఎంటెక్‌ చదువుకు మద్యలోనే స్వస్తి చెప్పి ఉద్యమంలో చేరారు. *అప్పటి నుంచి 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు.* నక్సల్‌బరి ఉద్యమంలో చేరాక స్వగ్రామానికి ఎప్పుడూ రాలేదని గ్రామస్థులు చెబుతున్నారు.
*అలిపిరి దాడిలో ప్రధాన సూత్రధారి కేశవరావు..*
మిలటరీ దాడుల వ్యూహకర్తగా నంబాల కేశవరావుకు పేరుంది. మిలిటరీ ఆపరేషన్లలో సిద్ధహస్తులు. మిలటరీ వ్యూహాల రూపకల్పన, అమలు, ఆయుధాల వ్యాపారులతో సత్సంబంధాలు నెరపడం ఆయన ప్రత్యేకతలు. దశాబ్దకాలం పాటు కేంద్ర మిలటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు. గణపతి తర్వాత పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గణపతితో పోల్చితే పార్టీ సిద్ధాంతాల అమల్లో మరింత కఠినంగా వ్యవహరించేవారు. దూకుడు స్వభావం కలిగిన కేశవరావు.. ప్రతిఘటన ద్వారానే లక్ష్యం సిద్ధిస్తుందని బలంగా నమ్మే స్వభావమని ఓ పోలీసు అధికారి తెలిపారు. అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్‌ మైన్స్‌ దాడిలో ప్రధాన సూత్రధారి నంబల కేశవరావు. ముఖ్యంగా *2010 ఏప్రిల్ లో ఛత్తీస్‌గఢ్‌లోని చింతల్నార్‌ ఘటనలో వ్యూహం ఆయనదే* గస్తీకి వెళ్లి తిరిగివస్తున్న సీఆఆర్పీఎఫ్‌ జవాన్లు రెండు కొండల మధ్యకు వచ్చాక మావోలు అకస్మాత్తుగా విరుచుకుపడ్డారు. జవాన్లు పారిపోయే అవకాశం కూడా దక్కలేదు. *ఈ ఘటనలో 74 మంది జవాన్లు చనిపోయారు.* 2013లో *సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మపై దాడి వ్యూహం కూడా కేశవరావుదే.* ఈ ఘటనలో *మహేంద్రకర్మతోపాటు మరో 27 మంది మరణించారు.*

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird